Saturday, September 29, 2012

పాము బండి ఎక్కండి

కప్పల రాజ్యంలోకి తాచుపాము వచ్చింది.
‘ఎన్నాళ్లిలా కాళ్లీడ్చుకుంటూ తిరుగుతారు? దయచేసి నన్ను వాహనంగా చేసుకోండి. ఎక్కడికి పడితే అక్కడికి యమస్పీడుగా వెళ్లండి. మీ సేవలో నన్ను తరించనివ్వండి’ అని ప్రాధేయపడింది. కప్పలరాజు ‘సరే’ అన్నాడు. కప్పలు బిలబిలా పామునెక్కి ‘బలేబలే’ అంటూ దర్జాగా విహరించసాగాయి.
కాసేపటికి పాము నీరసించి ఆగిపోయి, ‘ఇక నా వల్లకాదు. ఆకలేస్తోంది’ అంది. రాజు దయతలిచి ‘మాలో ఓ చిరుకప్పను తిను’ అని పర్మిషను ఇచ్చాడు. తిన్నాక పాము బండి మళ్లీ కదిలింది. కాసేపటికి మళ్లీ ఆగింది...
కట్ చేస్తే - రాజుతోసహా కప్పలన్నీ పాము బొజ్జలోకి వెళ్లాయి. కప్పలరాజ్యం పాము పరమైంది.
చిన్నప్పుడు చదువుకున్న పంచతంత్రం కథ ఇది. పెద్దయ్యాక మరచిపోయాం. అందుకే విదేశీ త్రాచులకు మరీమరీ అలుసవుతున్నాం.
లేటెస్టుగా ఇప్పుడు మొదలైందీ అదే కథ.
బహుళ జాతీయ తెల్లతాచుల కన్ను చాలకాలంగా మన కిరాణా కప్పల మీద పడింది. ‘వీధి వీధికీ, సందు సందుకూ ఇన్ని బుల్లి దుకాణాలెందుకు? రోడ్లమీద ఇన్ని తోపుడు బండ్ల వ్యాపారాలెందుకు? దారి పక్క తట్టలూ బుట్టల్లో చిల్లర మల్లరగా సరుకులమ్ముతూ పోతే పాపం మీ దేశం ఎప్పటికి బాగుపడుతుంది? ఉత్పత్తిదారుకూ, వినియోగదారుకూ మధ్య ఇన్నిన్ని అంచెలుంటే ధరలెలా తగ్గుతాయి? మాకు కాస్త అవకాశమివ్వండి. అమెరికా లెవెల్లో ఎక్కడికక్కడ లంకంత ‘మాల్స్’ తెరుస్తాం. తయారీదారునుంచి నేరుగా కొని, వాడకందారుకు సరసమైన ధరకు నేరుగా అమ్మి వారికీ వీరికీ లాభం చేస్తాం. లక్షల మందికి ఉద్యోగాలిస్తాం. కోట్లమందిని ఆదుకుంటాం. పెట్టుబడులకు మొగంవాచిన మీ ఆర్థికరంగంలోకి లక్షల కోట్ల రూపాయలు కుంభవృష్టి కురిపించి, మీ నేలబారు బతుకులను ఆకాశానికి లేపేసి స్వర్గం చూపిస్తాం’ అని మన ఏలినవారికి బంపర్ ఆఫర్ ఇచ్చాయి.
అన్నీ కోతలే. అంతా మోసమే. వాల్‌మార్ట్, కారెఫొర్ లాంటి సీమనాగులు ఇప్పటికే అనేక దేశాల్లో పడగవిప్పాయి. తమ నీడపడిన ప్రతిచోటా చిల్లర కప్పలను టోకున మింగి, అన్ని వర్గాలకూ సమాన అన్యాయం చేసి తెగబలిశాయి.
ఎక్కడిదాకానో ఎందుకు? ప్రపంచ పెట్టుబడి పెద్దమ్మ అయిన అమెరికాలో ఆహార పదార్థాల మీద వినియోగదారు చెల్లించే ప్రతి డాలరుపైనా పండించే రైతుకు 70 సెంట్లు 1950ల దాకా ముట్టేది. 1996 వరకూ కూడా చిల్లర ధరలో 52 శాతం రైతుకు అందేది. నడమంత్రపు కిరాణా విప్లవం వచ్చి వాల్‌మార్టుల పాలపడ్డాక అది కాస్తా ఇప్పుడు 38 శాతానికి పడిపోయింది. బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లోనూ ఇంచుమించుగా అదే స్థితి. మామూలు వర్తక విధానంలో తయారీదారుకూ, వినియోగదారుకూ మధ్య ఉండే పలు అంచెల దళారులను కార్పొరేట్ కొండ చిలువలు వచ్చి మింగేసిన మాట నిజమే. కాని దానివల్ల ఆదా అయ్యే మొత్తాన్ని ఆ కొండ చిలువలే తేరగా ఆరగిస్తున్నాయ తప్ప అటు ఉత్పత్తిదారుకు గాని, ఇటు వాడకం దారుకుగాని వీసమెత్తు ఉపయోగం లేదు. అమెరికాలో ఏటా 30వేల కోట్ల డాలర్లకు పైగా ప్రభుత్వ మిచ్చే వ్యవసాయ సబ్సిడీ మీదే అక్కడి రైతుల మనుగడ ఆధారపడి ఉంది. కిరాణా వ్యాపారంలో గుత్త్ధాపత్యం చలాయిస్తున్న వాల్‌మార్టుల్లాంటి మోతుబరి సంస్థలు పంట పండించేవాడికి గిట్టుబాటు ధరనే ఇస్తున్నట్లయితే సర్కారీ సబ్సిడీకోసం అంగలార్చాల్సిన అగత్యం అమెరికన్ రైతుకు పట్టేది కాదు. వాళ్ల దేశంలోనే రైతుల నోట మట్టికొట్టే పుణ్యాత్ములు... మన దేశంలో అడుగుపెట్టనిస్తే మన రైతుల నోట్లో పంచదార పోస్తారని నమ్మాలిట!
తలుపులు బార్లా తెరిచి విదేశీ బందిపోట్లని లోపలికి రానిస్తేగానీ ఇండియా ముందుకు పోదు; మా అంతగా బాగుపడదు... అని అమెరికా దేవర ఒబామా ఈ మధ్య మన గవర్నమెంటుకు క్లాసు తీసుకుని చిటపడలాడుతున్న సమయంలోనే అక్కడ అదే అమెరికాలో పెద్ద ఆందోళన నడిచింది. ఆ దేశంలో చిన్నచిన్న దుకాణాలను తొక్కేసి కిరాణా రంగంలో పోతరించిన వాల్‌మార్టు సరిగా జీతాలు ఇవ్వకుండా ఎడాపెడా కార్మికులను దోపిడీ చేస్తున్నదని బాధితుల ఫిర్యాదు. డాలర్ పుణ్యభూమిలోనే పరిస్థితి అంత లక్షణంగా ఉంటే అదే వాల్‌మార్టు చేతికి మన కిరాణా వ్యాపారాన్ని అప్పగిస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలొస్తాయి, ఇప్పటిదాకా చిన్నకొట్లలో చాలీచాలని జీతాలతో దోపిడీకి గురవుతున్న పనివారి బతుకులు బంగారమవుతాయి అంటూ కార్పొరేట్ల బాకాలు మన చెవుల తుప్పు వదిలిస్తున్నాయి.
విదేశీ పెట్టుబడులు మనకు చేదేమీ కాదు. పి.వి.నరసింహారావు ఆర్థిక సంస్కరణల తెరచాప ఎత్తింది లగాయతు ఈ ఒకటి రెండు దశాబ్దాల్లో అనేక రంగాల్లో వేరువేరు మోతాదుల్లో విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. వాటివల్ల కనీసం కొన్ని రంగాల్లో కావలసినంత మేలు జరిగింది కూడా. రిలయెన్సు, స్పెన్సర్సు, సిటీ సెంట్రలు లాంటి మాల్సు, సూపర్, హైపర్ మార్కెట్లు ఇప్పటికే మన నగరాల్లో నడుస్తుండగా లేనిది వాటి సరసన ఇంకో విదేశీ వాల్‌మార్టు వెలిసి ఇంకా చవకగా నాణ్యమైన సర్వీసు ఇస్తానంటే ఎందుకు కాదనాలి - అన్న అభిప్రాయం మనవాళ్లు చాలా మందికి ఉంది.
మార్కెట్‌లో పోటీదార్లను తొక్కెయ్యటం కోసం మొదట్లో చిల్లర ధరలను బాగా తగ్గించినా, గుత్త్ధాపత్యం చేతికొచ్చాక ఇష్టానుసారం ధరలు పెంచి జనాన్ని నంజుకు తినటం వాల్‌మార్టాసురులకు వెన్నతోపెట్టిన విద్య. ఇప్పుడు పెద్ద నగరాల్లోని దేశవాళీ మాల్స్‌వల్ల, అదే ఊళ్ళలోని చిల్లర వ్యాపారాలకు, పట్టణ, గ్రామస్థాయిల్లో కిరాణా బిజినెసుకూ, వాటిమీద ఆధారపడ్డ కోట్లమంది బతుకుతెరువుకూ డోకాలేని మాట నిజం. కాని విదేశీ పెత్తందార్లు వచ్చాక సీను ఇలా ఉండదు. బిగ్‌బజార్‌లయినా, ‘మోర్’ మార్కెట్లయినా, మరొకటయినా ఇక్కడ తయారైనవాటిని ఇక్కడ అమ్మగల వంతే. అదే వాల్‌మార్టో, మరో బహుళజాతి భూతమో అయితే... ఆఫ్రికాలో కారుచవకగా సరుకును తయారుచేయించి ఇండియాలో అమ్మగలవు. కోకాకోలా, పెప్సీలు వచ్చి మన పండ్ల రసాల కంపెనీలను మింగేసి పనికిమాలిన రంగునీళ్లను అందరిచేతా తాగిస్తున్నట్టే... రేపు వచ్చే వాల్‌మార్టులు ఇంకా పెద్ద స్థాయిలో, ఇంకా దుర్మార్గంగా మన అభిరుచులను, ఆహారపు అలవాట్లను ఆనవాళ్లు లేకుండా మార్చెయ్యగలవు. జన్యుమార్పిడి విత్తనాలతో పత్తి రైతులను సర్వనాశనం చేసినట్టే రేపు జన్యుమార్పిడి బియ్యాలూ, జొన్నలూ, గోధుమలూ, కూరగాయలూ తెచ్చిపెట్టి, అవి మినహా మరేవీ మార్కెట్లో దొరక్కుండా చేసి, మన తిండిని శాసించగలవు. మనకు మనల్నే పరాయివాళ్లుగా మార్చెయ్యగలవు.
‘అంత పెద్ద రెడ్డి చెయ్య పట్టుకుంటే కాదనేదెట్టా’ అన్న పల్లెటూరి వగలాడిలాగా అమెరికా ప్రెసిడెంటంతటి పెద్దసారు నోరు తెరిచి మందలించాక, ఇంకా తాత్సారం చేస్తూ కూచుంటే ఎలా అని మాన్య ప్రధాని మన్‌మోహన్‌జీ కూడా అన్నిటికీ తెగించి, కప్పలరాజు మల్లే కిరాణాలో విదేశీ పెట్టుబడికి గ్రీన్ సిగ్నలు ఇచ్చేశాడు. ఎక్కి ఎంజాయ్ చెయ్యటానికి మనం రడీ! ఇక సీమత్రాచులదే ఆలస్యం.

SOURCE: ANDHRABHOOMI DAILY

Friday, May 25, 2012

జగన్ కు భలే చాన్సు.

పనిమంతుడు పందిరివేస్తే పిచ్చుకలు వచ్చి కూలదోశాయట. జగన్ అనే నరాధముడిని రాజకీయంగా వధించటానికి తెలుగుదేశం కౌటిల్యుల లోపాయకారీ సాయంతో కాంగ్రెస్ పెద్ద దిక్కులు వేసిన సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ జయప్రదంగా అడ్డం తిరిగింది. తెలివిమీరిన సర్కారువారు వై.ఎస్.జూనియర్‌ని కేసుల ఉచ్చులో ఇరికించబోయి తామే ఇరుక్కున్నారు. తాము తీసిన గోతిలో తామే పడ్డారు.
చెరుూ్య మనదే, కత్తీ మనదే కాబట్టి పీక కోసుకున్నా ఏమీ కాదని పాలక మారాజులకు మా చెడ్డ నమ్మకం. కేసులు పెట్టించిందీ మనమే, వాటి దుంపతెంచేదీ మన పెంపుడు సిబిఐయే కాబట్టి మనం ఎలా ఆడినా చెల్లుతుందని ప్రభువులు మహాధీమాగా ఉన్నారు. వారి అతి విశ్వాసమే ఇప్పుడు కొందరు మంత్రులకూ మొత్తంగా కాంగ్రెసు సర్కారుకూ కొంప ముంచుతోంది.
తెలంగాణ ఉప ఎన్నికల పరాభవం నుంచి తేరుకోకుండానే పులిమీద పుట్రలా సీమాంధ్ర ఉప ఎన్నికలొచ్చాయి. వాటిలో పరువు దక్కితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు. విచిత్ర విన్యాసాలు ఎన్ని చేసినా కాంగ్రెసుకూ, కొన్ని విషయాల్లో దాని వ్యూహాత్మక రహస్య భాగస్వామి తెలుగుదేశానికీ కనీసం డిపాజిట్లు దక్కే గ్యారంటీ లేదని ‘దేశం’ మార్గదర్శులు, కాంగ్రెసు కుశాగ్రబుద్ధులు చేయించిన రహస్య సర్వేల్లో తేలిందట. ఎక్కడచూసినా జగన్ గాలే వీస్తూండటంతో, ఆ గాలిని బంధించి, ఎలాగైనా అతగాడిని ఉప ఎన్నికల రంగం నుంచి తప్పిస్తే తప్ప లాభం లేదని ఏలినవారికి అమోఘమైన ఐడియా వచ్చింది.
ఆ ముచ్చట తీరాలంటే సిబిఐ ఆల్సేషియన్లని ఉసికొలిపి శత్రువును ‘లోపల’ వేయించటమే వాటమైన ఉపాయం. ‘పైవాళ్ల’ కనుసన్నల్లో దర్యాప్తు తతంగం 9 నెలలుగా జరుగుతున్నా... అసలు కథానాయకుల జోలికి పోనివారు... నెంబర్‌వన్ నిందితుడిని ఒక్కసారైనా పిలవనంపకుండానే ఒకే కేసులో ఇప్పటికి మూడు చార్జిషీట్లు వేసేసిన వారు... వాటిపై సమన్లు అందుకుని రేపో మాపో కోర్టులో హాజరుకానున్న తరుణంలో - ఆదరాబాదరా అతడిని అరెస్టు చేస్తే గవర్నమెంటు ఇరుకునపడవచ్చు. ఒక్కడిమీద కక్ష కట్టారన్న చెడ్డపేరు రావచ్చు.
మరి ఏమి చేయాలి? అతడికంటే ముందు తమలో నుంచి ఒకరిద్దరు మంత్రులను అరెస్టు చేయించాలి. చూశారా, అంతటి వారినే వదల లేదు. కాబట్టి మాకు పక్షపాతం, కక్షపాతం ఏమీ లేదు అని వెర్రిజనాన్ని నమ్మించి, ఆ తరవాత అసలు విరోధిని జైల్లో వెయ్యాలి. చదరంగం ఆటలో రాజును కట్టెయ్యటానికి ఒక పావును బలి ఇస్తారే... అలాగన్నమాట!
ఆలోచన ఏడ్చినట్టే ఉంది. తొలి బలికి ఎంచుకున్నది ఒక బి.సి. మంత్రిని! దాంతో బి.సి. వర్గాలు భగ్గుమన్నాయి. మంత్రి నియోజకవర్గంలోని అభిమానులైతే చెలరేగి బస్సులు, ఆస్తులు తగలబెట్టేశారు. బి.సి. మంత్రిని వేసేసినందుకు బి.సి.లు గోల పెట్టారు కనుక, వారి ఓట్లు చాలా అవసరం కనుక, వారిని సముదాయించటానికి సెకండ్ రౌండులో ఒక రెడ్డి మంత్రిని జైలుకు పంపాలని - అనుకుంటున్నారట. దానిమీద ఆ కులపోళ్లు మండిపడితే ముచ్చటగా మూడోకులం మంత్రిని బలిపీఠం ఎక్కిస్తారేమో!!
పావు శతాబ్దం కింద జగమొండి ఎన్టీ రామారావు తన కేబినెట్ మంత్రిమీదే ఎ.సి.బి. చేత వలపన్నించి, అవినీతి కేసులో అరెస్టు చేయిస్తే లోకమంతా ఓహో అంది. ఇప్పుడు మహానాయకుడు కి.కు.రెడ్డి తన కేబినెట్ మంత్రికి మొండి చెయ్యి చూపి, ఇంకో రకం అవినీతి కేసులో అరెస్టు కానిస్తే అదే లోకం దుమ్మెత్తిపోస్తున్నది. దానికి లోకుల్ని నిందించి ప్రయోజనం లేదు.
కేబినెట్ మంత్రిని సిబిఐ అరెస్టు చేసింది ఎవరిదగ్గరో లంచం పట్టి అడ్డమైన మేలేదో చేసినందుకు కాదు. కేబినెటు ఆమోదించిన విధానం మేరకు ఎవరికో ఏదో ఉపకారం చేసే జీవోలకు ముఖ్యమంత్రి ఆదేశిస్తే మమ అన్నందుకు! కేబినెట్ నిర్ణయాలను అమలుచేసిన నేరానికి మంత్రులను బలి ఇస్తూపోతే మంత్రివర్గ సమష్టి బాధ్యత సూత్రం ఏ గంగలో కలిసినట్టు? అధికారపక్షం అధినాయకత్వానికి గిట్టని ఒక్క తిరుగుబాటుదారును తిప్పలు పెట్టటంకోసం, అతడిని, అతడి తండ్రిని నేరస్థులుగా చిత్రించటం కోసం... పూర్వమున్నదీ తమ పార్టీ ప్రభుత్వమేనని మరచి, దానిలో భాగస్వాములైన ప్రస్తుత మంత్రులను జైలుకు పంపితే పోయేది పాలకపక్షం పరువేకదా? ఎవరికో అనుచిత లబ్ధి చేకూర్చిన నిర్ణయాలకు బాధ్యుడైన ముఖ్యమంత్రి మరణించి ఉండవచ్చు. కాని ఆయన పనుపున అన్ని వ్యవహారాలూ చక్కబెట్టిన ‘‘ఆత్మ’’ ఇప్పటికీ మన మధ్యనే ఉన్నది కదా? మంత్రుల మీదా, ఐఎఎస్ అధికారుల మీదా ప్రతాపం చూపి అరెస్టులు చేయించే సర్కారు... వారి నెత్తిన కూచుని, మెడలు వంచి జీవోలు జారీ చేయించుకున్న అసలు సూత్రధారి ఊసే ఎత్తదేమి? పైవారి అండ ఆత్మగారికి ఉన్నందు వల్లేనా? ఇలా మనిషినిబట్టి వైఖరి మారుస్తూ పోవటంవల్లే కదా సిబిఐకి ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’గా పేరొచ్చింది?
పోనీ ఇంతగా విధంచెడ్డా జగన్ అనే వాడి నోరు నొక్కేసిన ఫలం దక్కిందా? ఆ కుర్రవాడిని తన మానాన తాను ప్రచారం చేసుకోనిచ్చి ఉంటే ఆ ప్రభావమేదో ఆయా నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యేది. మిగతా దేశం అతడి మాటల మీద పెద్దగా దృష్టి పెట్టేదికాదు. ఎక్కడో ఒక జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఒకే మూస ప్రచారం చేసుకుంటున్న వాడిని తీరి కూర్చుని హైదరాబాదుకు పిలిపించి, అతడేదో అమెరికా ప్రెసిడెంటు అయిన లెవెల్లో భారీ బందోబస్తులు చేసి, రాష్టమ్రంతటా రెడ్ అలర్ట్ ప్రకటించి, సిబిఐ అడ్డాలో అతడి ప్రశ్నోత్తరాల కార్యక్రమం అతి ప్రధాన జాతీయ సమస్య అయిన రీతిలో నానా హంగామా చేయడంవల్ల ఏమైంది? జగన్ అంటే గిట్టని చానల్సు, జాతీయ మీడియా కూడా పొద్దస్తమానం అతడి ముఖానే్న చూపిస్తూ, అతడి గురించే మాట్లాడుతూ, అతడి మాటలే వినిపించటంతో కాణీ ఖర్చు లేకుండా రాష్టమ్రంతటా, దేశమంతటా విస్తృత ప్రచారం రాబట్టే సువర్ణావకాశం అతడికి దక్కింది. మండే ఎండలో తిరిగి ప్రచారం చేయాల్సిన బాధ తప్పించి హాయిగా ఎ.సి. రూములో కూచోబెట్టి సిబిఐ విచారణ పేరిట వందలకోట్ల రూపాయల విలువైన పబ్లిసిటీని తనకు సమకూర్చిపెట్టిన ఢిల్లీ పెద్దలకు, సిబిఐ మార్గదర్శులకు జగన్ ఆజన్మాంతం రుణపడి ఉండాలి. నిండా మూడేళ్ల రాజకీయ అనుభవం లేని ఒక వివాదాస్పద వ్యక్తిని జాతీయస్థాయిలో హీరోను చేసిన కాంగ్రెస్ పెద్దల తెలివికి జోహార్లు!


Copy N Paste from Andhrabhoomi.net



జగన్ ను ఈ రోజు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు?

ప్ర. జగన్  ను ఈ రోజు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు?

జ. పరిస్థితులు కొంచం వేడిగా ఉన్నాయి . రెండు రోజులు విచారణ  పేరుతో జాప్యం చేస్తే చల్లబడుద్ది. తర్వాత తీరిగ్గా అరెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడికి పోతాడు..


Saturday, May 19, 2012

పత్రికల పంచాంగం


పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణమన్నాడట. తెలుగు మీడియా పెత్తందార్లూ అదే టైపు. రేపోమాపో ‘సాక్షి’కి తాళం ఖాయం అని ఎవరూ అడక్కుండానే అవి జోస్యాలు చెబుతున్నాయి. దేవుడు మేలుచేసి, వాటి వాక్కు ఫలించి అంతపనీ జరగాలేగానీ ‘ఆ రెండు పత్రికల’కు పండగే పండుగ.
గిట్టని పత్రికల మీద పాలకులు పగబట్టటం దేశానికి కొత్తకాదు. పక్కలో బల్లెంలాంటి పత్రికా సంస్థల మీద కేసులు పెట్టటం, గవర్నమెంటు అడ్వర్టయిజ్‌మెంట్లను ఆపెయ్యటం, బ్యాంకు అకౌంట్లు బిగదియ్యటం, జైల్లోకి తొయ్యటం లాంటి ఆయుధాలను ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా పత్రికల మీద చాలా ప్రభుత్వాలు ప్రయోగించాయి. అధికారం చెలాయించేవారు అలాంటి ఆగడాలకు దిగినప్పుడు విపక్షాలూ, తోటి మీడియా సంస్థలూ బాధిత పత్రికకు సంఘీభావం తెలపటం పరిపాటి.
ఇప్పుడు తెలుగునాట కన్నుల పండువ చేస్తున్న అద్భుత దృశ్యం దీనికి భిన్నం. పాలకపక్షమూ, ప్రధాన ప్రతిపక్షమూ, మీడియా మోతుబరులూ కూడబలుక్కున్నట్టు ఒకానొక పెద్ద మీడియా సంస్థను నవరంధ్రాలూ మూసి చంపెయ్యటానికి కలిసికట్టుగా తలా ఒక చెయ్యి వేస్తున్నారు. పనిలో పనిగా పత్రికా స్వేచ్ఛ అనగానేమి? అది ఎవరికి వర్తించును? ఎవరికి వర్తించదు? సమయానుకూలంగా దానికి భాష్యాలు ఎలా మారును -అన్న వాటిమీదా అమూల్య ప్రవచనాలను తెలుగు మీడియా దొరలు లోకం మీదికి వదులుతున్నారు.
సాక్షి పేపరు, ఛానెలు పాపపు సొమ్ముతో పుట్టాయట. ఆ సంగతి తెలిసే వాటిలో చేరిన ఉద్యోగులకు అవికాస్తా సర్కారీ కత్తికోతకు గురైతే తమ గతి ఏమిటని లబలబలాడే హక్కు ఉండదట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసే పత్రికాధిపతికి ప్రభుత్వం కూడా తన మీద దెబ్బకు దెబ్బ తీస్తుందన్న ఇంగితజ్ఞానం ముందే ఉండాలట. గిట్టని పత్రిక మీద కేసులు పెట్టటం, నానా విధాల వేధించటం గవర్నమెంట్ల జన్మహక్కట! తప్పుడు దారిలో పెట్టుబడులను రాబట్టినప్పుడు ఆ అభియోగంతో సంబంధం లేని మీడియా సంస్థల బ్యాంకు అకౌంట్లు ఆపేసినా, ఆస్తులు జప్తు చేసినా, యజమానులను నెట్టేసి ఏకంగా పత్రికా నిర్వహణనే సర్కారువారు తమ చేతుల్లోకి తీసుకోవాలని ఎత్తువేసినా పాపిష్టి సంస్థలో చేరిన నేరానికి జర్నలిస్టులు నోరుమూసుకుని భరించాల్సిందేనట.
ఇవి పత్రికా రంగంలో పుట్టి పెరిగిన వారికి ఇప్పటిదాకా ఊహకైనా అందని మిడిమేలపు సుద్దులు.
పత్రికా స్వేచ్ఛ అనేది పత్రిక నడిపే యజమానిదీ కాదు. అందులో పనిచేసే పాత్రికీయ సిబ్బందిదీ కాదు. నిజానికి పత్రికా స్వేచ్ఛ ఉన్నదీ, కావలసిందీ సమాజానికి; అందులోని సాధారణ ప్రజాబాహుళ్యానికి! ఎంతసేపూ ఒక పార్శ్వానే్న చూపిస్తూ రెండోవైపు యథార్థాన్ని పత్రికలు ప్రజలకంట పడనివ్వకపోతే పత్రికా స్వేచ్ఛ ఉండీ లేనట్టే.
మీడియా రాజ్యం ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి భోజ్యమై, పెద్ద పత్రికలు రెండూ ఆ వర్గానికి ఆత్మబంధువైన ఒక రాజకీయ పార్టీకి హితవరులై... ఉన్న నిష్పాక్షిక పత్రికలకేమో బలం పరిమితమైన స్థితిలో కొనే్నళ్ల కిందటిదాకా తెలుగునాట ఏకపక్ష పత్రికాస్వామ్యం రాజ్యమేలింది. పెద్దనోటి పెద్ద పత్రికలు రాసిందే వార్త, చెప్పిందే నీతిగా చలామణి అయింది. మోతుబరుల ఆధిపత్యాన్ని సవాలుచేస్తూ వారి పాఠాన్ని వారికే అప్పజెబుతూ, జగన్ అనేవాడు జబర్దస్తీగా వచ్చి సొంత పత్రిక, చానెలు పెట్టి, నాణేనికి రెండోవైపును జనం ముందు పెట్టసాగాక తెలుగు మీడియారంగం వౌలికంగా మారింది. పాఠక లోకానికి దీటైన ప్రత్యామ్నాయమనేది దొరికింది. పక్షపాత పైత్యాలూ, పరిణతి లోపించిన చాపల్యాలూ, ప్రత్యర్థులను పోలిన అవలక్షణాలూ కొత్త దుకాణంలోనూ ఎన్ని ఉంటేనేమి? పాచి నోటితో నీతిబోధలు చేసే పత్రికా పీఠాధిపతుల మట్టికాళ్లను బట్టబయలు చేయటంలో సరికొత్త పత్రిక కృతకృత్యమైంది. దాన్ని భరించలేకే ఇప్పుడు మీడియా మల్లుల శాపనార్థాలు.
వై.ఎస్. జగన్ అనేవాడు అనె్నంపునె్నం ఎరుగని అమాయకుడన్న భ్రమ ఎవరికీ లేదు. తండ్రి అధికారాన్ని ఆసరా చేసుకుని అతడు అనేక విధాల లబ్ధిపొందిన సంగతి బహిరంగ రహస్యం. ‘ఆ రెండు పత్రికలు’ ఎప్పటినుంచో పదేపదే నొక్కి వక్కాణిస్తున్నట్టు వై.ఎస్. సర్కారు నుంచి పొందిన అనుచిత, విపరీత ప్రయోజనానికి ప్రతిఫలంగానే ఆయా సంస్థలు రకరకాల మార్గాల్లో ‘సాక్షి’ మీడియాలో పెట్టుబడులు పెట్టిన మాట నిజమేనేమో! కాంగ్రెసువారూ, తెలుగుదేశంవారూ రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి చేతులు కలిపి, జగన్ మీద జాయింటుగా చేసిన పితూరీని పురస్కరించుకుని హైకోర్టు పురమాయింపుపై రంగంలోకి దిగిన సిబిఐ ఆయా నేరాలను నిరూపించగలిగితే అందరికీ సంతోషమే. చట్టబద్ధంగా నేరం రుజువయ్యాక జగన్‌నీ, అతడితో కుమ్మక్కయిన వారినీ ఉరి తీస్తామన్నా ఎవరికీ అభ్యంతరం అక్కర్లేదు. ఆ క్రమంలో అనివార్యంగా అతడి మీడియా సంస్థలు మూతపడ్డా ఎవరూ కన్నీరు కార్చాల్సిన పనిలేదు.
కాని - ఇప్పుడు జరుగుతున్నదేమిటి? టీవీల్లో డైలీ సీరియల్ లాగా అంతూ పొంతూ లేకుండా వరసగా చార్జిషీట్లు వేస్తూ, ‘ఆ రెండు పత్రికలు’ వై.ఎస్. జీవితకాలం నుంచీ వినిపిస్తున్న అభియోగాల రికార్డును తు.చ. తప్పక వన్స్‌మోర్ అనడానికి మించి, సిబిఐ కొత్తగా కనుక్కున్న కొత్త సత్యం ఒక్కటైనా ఉందా? చేంతాడంత నిందితుల జాబితాలో ఎవరిని పడితే వారిని జుట్టుపట్టి జైల్లోకి నెట్టిన మహాపత్తేదారులు నెంబర్‌వన్ నిందితుడైన జగన్‌ను అరెస్టుచేసేందుకైతే సాహసించక... అతడి మీడియా సంస్థల మీద మాత్రం వరసగా దాడులు చేయటంలోని ఆంతర్యమేమిటి? ఆ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడుల మూలాలను ఆరా తీయవలసిన సిబిఐ -ఆ అసలు పని వదిలి పత్రిక, టీవీ సంస్థల దైనందిన నిర్వహణకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఎందుకు స్తంభింప జేయాల్సి వచ్చింది? ఏదో ఒక విధంగా ఆ మీడియా సంస్థలను తమ కంట్రోల్లోకి తీసుకోవాలని, అది వీలుకాకపోతే ఏకంగా మూసివేయించాలని రాష్ట్ర ప్రభువులు ఉవ్విళ్లూరటం, అది చూసి మీడియా కరటకదమనకులు లొట్టలు వేయటం దేనికి సంకేతం? పత్రిక యజమాని మీద క్రిమినల్ కేసులో చార్జిషీటు పడిందన్న నెపంతో పత్రికా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలను బిగదియ్యబోవటం ఏమి న్యాయం? రాష్ట్రంలోని మీడియా అధిపతుల్లో ఎందరిమీద క్రిమినల్ కేసులు లేవు? ఎందరు జైలుకు పోలేదు? వారందరికీ ప్రకటనలు ఆపేశారా? బ్యాంకు ఖాతాలు బిగదీశారా? పెట్టుబడులు పాపిష్టివైతే మీడియా సంస్థలు నడవటానికే వీల్లేకపోతే... మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టిందెవరో, వెనక ఉన్నది ఎవరో అతిరహస్యమైన ‘‘ఆత్మ తృప్తి’’ పత్రికలు, చానెళ్లు ఎన్నిలేవు? వాటిమీదా ఇలాగే పడతారా?
Copy N Pasted from Andhra Bhoomi Daily

Tuesday, May 15, 2012

Leave Application Format


LEAVE APPLICATION


Name of the Employee: _____________________________________________

Designation: ______________________________________________________

Department: _______________________________________________________

Type of Leave:

PL: _______    CL: __________  SL: __________ ML: _________  CO: _______

Desired From: _____________  to __________ No.of Days: _________________

Reporting Date from Leave: ____________________________

Reason: _____________________________________________________________

Address while on Leave: ___________________________________________________

_______________________________________________________________________

________________________________________________________________________

Date: ___________                                                    Signature of Employee: __________

Approval:

HR Department Approval:

Comments: ___________________________            Signature: ____________________

Senior Approval:

Comments: ___________________________            Signature: ____________________

Saturday, May 12, 2012

పెక్యులరిజం!

ప్రపంచంలోని సెక్యులర్ దేశాలకూ, మనకూ తేడా ఏమిటి?
ఇతర దేశాలు అనుసరించేది సెక్యులరిజం. మనం నిష్ఠగా పాటించేది ‘పెక్యులరిజం.’
మతాలతో నిమిత్తం లేకుండా పౌరులందరినీ సమానంగా చూసి, మెజారిటీ మతస్థులకు ఉన్నన్ని హక్కులను, అవకాశాలను మైనారిటీలకు కూడా కల్పించటం అసలైన సెక్యులరిజం. మెజారిటీ మతస్థులకు లేని ప్రత్యేక హక్కులను, అవకాశాలను మైనారిటీలకు కల్పించి (లేక కల్పించినట్టు కనిపించి) మెజారిటీ మతస్థులను అడుగడుగునా వివక్షకు గురిచేసి, రెండో తరగతి పౌరులుగా చూడటం ఇండియన్ బ్రాండు ‘పెక్యులరిజం’.
దానివల్ల స్వదేశంలోనే పరాయివాళ్లమయి పోయామన్న క్షోభ మెజారిటీ మతస్థులకు కలిగే సంగతి అలా ఉంచండి. పక్షపాతపు పాలకుల చల్లని చూపునకు నోచుకున్న మైనారిటీలకైనా కష్టాలు తీరాయా? సర్కారీ వరాలవల్ల ఇల్లంతా బంగారమై వారు మురిసి ముప్పందుమవుతున్నారా? దరిద్రమంతా పోయి సుఖభోగాల్లో మునిగితేలుతున్నారా?
అదీ లేదు. ఓటు బ్యాంకులను కొల్లగొట్టే ఆబలో అన్ని పార్టీల అన్ని ప్రభుత్వాలూ మైనారిటీల మీద ఒలికిస్తున్న మెహర్బానీ ఒక మిథ్య. దానివల్ల మైనారిటీలకు నికరంగా ఒరిగేది బహు తక్కువ.
హజ్ సబ్సిడీ ఇందుకు గొప్ప ఉదాహరణ.
వెళ్లగలిగిన అవకాశం ఉన్న వారు జీవితంలో ఒకసారి మక్కాకు హజ్‌యాత్ర చేయాలని ప్రవక్త ఆదేశం. అది ఎవరికి వారు సొంత వనరులతో చేయాల్సిందే తప్ప, ప్రభుత్వం ఎదురిచ్చి సబ్సిడీతో సాయం పట్టాల్సిన విషయం కాదు. అలా చేయటం పవిత్ర ఖురాన్ బోధకు విరుద్ధం. ఆ ఉద్దేశంతోనే ఏ ఇస్లామిక్ రాజ్యమూ హజ్ యాత్రకు ప్రభుత్వం నుంచి సబ్సిడీని ఇవ్వగలిగే స్తోమతు పుష్కలంగా ఉన్నా ఇవ్వటం లేదు. భూ ప్రపంచం మొత్తంమీద ‘సెక్యులర్’ భారత ప్రభుత్వం ఒక్కటే - అదీ ఎవరూ అడగకుండానే, ముస్లిం వర్గాల నుంచి ఏ రకమైన డిమాండూ లేకుండానే ఏటా వందలకోట్ల రూపాయలను హజ్ యాత్ర నిమిత్తం కుమ్మరిస్తున్నది.
మామూలుగా జెడ్డాకు రానూపోనూ విమానం టిక్కెట్టు దాదాపు పాతికవేల రూపాయలు ఉంటుంది. హజ్ యాత్రికులను రవాణా చేసే విమానంలో వేరేవారు ప్రయాణించకూడదని సౌదీ సర్కారు నియమం. యాత్రికులను జెడ్డాలో దింపి ఖాళీగా తిరిగొచ్చి, మళ్లీ ఖాళీగా వెళ్లి వారిని వెనక్కి తీసుకురావాలి కనుక విమానం చార్జిలు సహజంగానే రెట్టింపు అవుతాయి. హజ్ యాత్రికులు వేరే ఎయిర్‌లైన్లో వెళితే మైలపడతారని, సర్కారువారి ఎయిర్ ఇండియా మాత్రమే వారిని పవిత్రంగా తీసుకువెళ్లగలదని మన సెక్యులర్ గవర్నమెంటు వారికి పెద్ద సెంటిమెంటు! ఆ తిండిదండుగ ఎయిర్ ఇండియాయేమో తన చేతకానితనాన్ని, అసమర్థ నిర్వహణనూ పూర్తిగా ప్రదర్శిస్తూ లెక్కలు వేసి మనిషికి 58వేల రూపాయల టిక్కెటు అయితే కానీ కుదరదంటుంది. దయగల సర్కారు అందులో 12వేల రూపాయలను మాత్రమే హజ్ యాత్రికుడి నుంచి ఇప్పించి, మిగతా 46వేలూ తన ఖజానా నుంచి ఎయిరిండియాకు సబ్సిడీ కింద చెల్లిస్తున్నది. తలకు నలభై ఆరువేల చొప్పున ఏటా సుమారు లక్షన్నర మందిని హజ్ యాత్ర చేయించి తరించడం కోసం ఏటా ఆరొందల యాభై కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చిస్తున్నది. దీనికి తోడు సుహృద్భావం పేరు పెట్టి ఎం.పీ.లు, అధికార పార్టీ ప్రముఖుల వంటి విఐపిల దండును మక్కాకు యాత్రికుల వెంట తోడ పెళ్లికొడుకుల్లా ఖర్చులు భరించి పంపటానికి వదిలే చేతిచమురు దీనికి అదనం.
దేశంలో నూటికి 70 మంది మెజారిటీ మతస్థులు కాబట్టి, పన్నులు వగైరాల రూపేణా సర్కారుకు వచ్చే రాబడిలో అత్యధిక భాగం మెజారిటీ వర్గం నుంచే జమ పడుతుంది. మెజారిటీ మతానికి చెందిన ప్రజల సొమ్ముతో ఒక మైనారిటీ మతం వారి తీర్థయాత్రకు విమాన చార్జిల్లో 80 శాతాన్ని ఏలినవారు సబ్సిడీ కింద భరించటానే్న ఈ దేశంలో సెక్యులరిజమని పిలుస్తారు. మెజారిటీకి లేని భోగాన్ని ఒక మైనారిటీ వర్గానికి మాత్రమే సమకూర్చటం ఏమి న్యాయం; హిందువులు అమరనాథ్‌కో, మానస సరోవరానికో పోయి రావటానికి కూడా ఇలాగే ప్రభుత్వ సబ్సిడీ ఎందుకు ఇవ్వరు అని మెజారిటీ మతస్థుల్లో అసంతృప్తి చాలా కాలంగా ఉన్నది.
మేడిన్ ఇండియా ‘పెక్యులరిజం’ మీద చాలా మందికి ఒళ్లు మండటానికి ఇదీ ఒక కారణం. ఇనే్నళ్లలో ఎంతమంది ఎన్ని విధాల ఆక్షేపించినా ఓట్ల యావ పాలకుల చెవికి సోక లేదు. అపోజిషన్లో ఉన్నంతకాలమూ హజ్ సబ్సిడీని తిట్టిపోసిన పెద్దనీతుల భాజపేయులు కూడా గద్దె మీద కూచున్నంత కాలమూ సదరు సబ్సిడీని రూపాయి తగ్గిస్తే ఒట్టు. ఎవరేమన్నా ఎన్ని గవర్నమెంట్లు మారినా చిరంజీవిలా వర్ధిల్లిన ఈ కొరగాని సబ్సిడీని అదృష్టవశాత్తూ మొన్న సుప్రీంకోర్టు చడామడా కొట్టి పడేసింది. సంతోషం.
ఏ సౌకర్యాన్నయినా చిరకాలంగా అనుభవిస్తున్న వారికి దాన్ని కాస్తా తీసేస్తున్నారంటే మనసు చివుక్కుమనటం సహజం. ఆ లెక్కన ఏటా వందలకోట్ల రూపాయల సబ్సిడీని ఇక లాగేస్తున్నారంటే ఈపాటికి ముస్లిం వర్గాలు మహా అసంతృప్తితో భగభగలాడుతూండాలి. కాని - చిత్రం! ఇంతకాలమూ సబ్సిడీని వ్యతిరేకించిన హిందువుల్లాగే సబ్సిడీని తేరగా అనుభవించారని అనుకోబడే ముస్లిములూ అదిపోతే ‘మరీ మంచిది’ అంటున్నారు. ఈ నడమంత్రపు సబ్సిడీని ఎప్పుడో తీసేయాల్సిందని జాతీయ ముస్లిం నాయకులే అంటున్నారు.
హజ్ సబ్సిడీ రాజ్యంగ బద్ధమేనని పదేళ్ల కింద తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు దశాబ్దం లేటుగానైనా వాస్తవాన్ని గుర్తించి... మైనారిటీలకు తాయిలంగా ఉద్దేశించిన ఈ సబ్సిడీ ఇస్లాం బోధకు విరుద్ధమని, తీసేస్తే మంచిదని ఇంకేదో కేసులో న్యాయ నిర్ణయం చేయటం మంచిదే. ఎటొచ్చీ అర్థంకానిదల్లా ఒక్కటే. ముస్లింలకు కూడా పెద్దగా ఇష్టంలేనట్టు కనపడుతున్న సబ్సిడీని... కొరగానిదని తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం ఇంకా ఎందుకు కొనసాగించాలి? దశలవారీగా తగ్గించి పదేళ్లకు దీన్ని మొత్తంగా ఎత్తేయాలని సుప్రీంకోర్టు చెప్పటంలోని మర్మమేమిటి? వెంటనే తొలగిస్తే తమకు చాలా కష్టం కనుక దశలవారీగా తగ్గించాలన్న అభ్యర్థన ముస్లిం వర్గాల నుంచి వచ్చి, అది సమంజసమని కోర్టు కూడా అభిప్రాయపడి, దశలవారీ ఎత్తివేతను సూచించి ఉంటే వేరే సంగతి. ప్రయోజనం పొందుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న వర్గంవారే అది తమకు అక్కర్లేదని చెబుతున్నప్పుడు పదేళ్లపాటు దానిని సాగదియ్యటం ఎందుకు? బానకడుపు ఎయిరిండియాను మరింతకాలం మేపటానికా?


Copy N Pasted From Andhrabhoomi.

Saturday, May 5, 2012

సేకరణ వార్త : కిడ్నాపే కల్పతరువు.


తుపాకి గొట్టం నుంచి అధికారం తన్నుకొస్తుందన్నాడు మావో.
అదంతా పాత చాదస్తం. మావోను చంపి పుట్టిన మావోయిస్టుల చేతిలో విప్లవం చాలా ముందుకు పోయింది. ఇప్పుడంతా షార్ట్‌కట్టు. కిడ్నాపే విప్లవ కోర్కెలు తీర్చే కల్పతరువు!
ఎన్ని మందుపాతరలు పేల్చినా, ఎందరు పోలీసులను మాటువేసి చంపినా, ఊళ్లమీద పడి ఎందరిని నరికి పోగులు పెట్టినా రాని పేరు, ప్రఖ్యాతి ఒక ఎమ్మెల్యేనో, ఒక కలెక్టరునో ఎత్తుకుపోతే కొల్లలుగా వచ్చిపడతాయి. ఒక దళాన్ని మట్టుపెడితే ప్రభుత్వం పది దళాలను పంపిస్తుంది. ఒక స్టేషనును పేల్చేస్తే కొత్తగా పది స్టేషన్లను తెరుస్తుంది. కాని- ఒక ప్రముఖుడిని కిడ్నాప్ చేస్తే? అదే ప్రభుత్వం గజగజ వణికి చేతులెత్తేస్తుంది. తోకముడిచి, తలకాయ తీసి జేబులో దాచుకుని ముక్కు నేలకు రాయమన్నా రాస్తుంది.
మావోల ఆటపట్టయిన ఒడిషాలో నిరుడు ఒక కలెక్టరునూ, ఈ మధ్య ఒక ఎమ్మెల్యేనూ వీరవిప్లవకారులు చెరపట్టినప్పుడు ఏమైంది? ఎన్నో ఖూనీలు, దోపిడీలు చేసి లెక్కలేనన్ని కేసుల్లో ముద్దాయిలై, కర్మంచాలక పోలీసులకు చిక్కిన కామ్రేడ్లను ఎందరిని విడిచిపెట్టమంటే అందరినీ గవర్నమెంటు బయటికొదిలింది. ఏ వేటను ఆపమంటే ఆ వేటను ఆపేసింది. రంగంలోని పోలీసులను ఏ దొడ్లోకి తోలమంటే ఆ దొడ్లోకి తోలేసింది.
టెర్రరిస్టులకూ, మావోయిస్టులకూ చేసే పనుల్లో తేడా లేకపోయినా... వారూ వీరూ తీసే ప్రాణాలూ చేసే విధ్వంసాలూ ఒకే బాపతువైనా వీరినీ వారినీ ఒకే గాటన కట్టటం చాలా బోలెడు తప్పు. నక్సల్ మార్కు మావోయిజమనేది కేవలం శాంతిభద్రతల సమస్యకాదు. సామాజిక, ఆర్థిక మూలాలకు మందువేసి నయంచేస్తే తప్ప అదిపోదు - అని అతివాద విప్లవ మేధావులు అడక్కపోయినా క్లాసు తీసుకుంటారు. పత్రికలు, సర్కారీ పెద్దలు, అమాంబాపతు బుద్ధి జీవులు కూడా అవే చిలకపలుకులు పలుకుతారు. మరి అట్టడుగు స్థాయిలో జనంలోకి వెళ్లి, పేద ప్రజల బాగుకు నిజాయతీగా కృషిచేస్తున్న కలెక్టర్లను ఎత్తుకుపోయి, ప్రాణాలు తీస్తామని బెదిరించటం ఏ రకమైన విప్లవ కమ్యూనిజం అని ఒక్కరూ అడగరు. విధి నిర్వహణ చేస్తున్న చత్తిస్‌గఢ్ కలెక్టరును కాపాడే డ్యూటీలో మావోయిస్టుల విప్లవ తుపాకులకు నిలువునా బలి అయిన ఇద్దరు బాడీగార్డులు ఏమి నేరం చేశారనీ పెద్ద మనుషులెవరూ అడిగిన పాపాన పోరు. ఆఖరికి మావోల చెరనుంచి బయటపడ్డ కలెక్టరు కూడా మావోలకూ, సర్కారుకూ మధ్యవర్తులుగా ఉన్న మహామేధావులకు కృతజ్ఞత చెప్పుకుంటాడే తప్ప... తన కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరు గన్‌మెన్లను అందరిముందు తలవనైనా తలవడు.
కిడ్నాపులు, బెదిరింపులు ప్రపంచానికి కొత్త కావు. మాటవరసకు అమెరికాలోనూ పంతం నెగ్గించుకోవటం కోసం ఎన్నో అపహరణలు జరిగాయి. ఆరు నూరైనా అలాంటి బ్లాక్ మెయిలింగులకు లొంగేది లేదని అక్కడి ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. ఇప్పటికీ అదే మాటమీద నిలబడింది. పౌరులనో, ప్రముఖులనో దుండగులు బంధించిన సందర్భాల్లో కమాండోలను పంపి బందీలను బలవంతంగా విడిపించటానికే అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో ఎన్ని ప్రాణాలు పోయినా, మొత్తం ఆపరేషను వికటించినా ప్రజలు మీడియావారు, బాధితుల బంధువులు కూడా పెద్ద మనస్సుతో అర్థం చేసుకుంటారు.
అదే మన దేశంలోనో? కిడ్నాప్ అరుూ్య కాగానే మీడియా వాళ్లకు శివాలెత్తుతాయి. బందీల కుటుంబాల క్షోభను క్లోజప్‌లో చూపిందే చూపించి, ఎప్పుడు కదులుతారు, ఎప్పుడు విడిపిస్తారు అంటూ గవర్నమెంటును గంట గంటకూ గుచ్చిగుచ్చి ప్రశ్నించి, మాస్ హిస్టీరియాను పనిగట్టుకుని పెంచి, కిడ్నాపర్ల పని సులభం చేసిపెడతారు. డ్యూటీ చేస్తున్న పోలీసులను చంపి, అమాయకులను నరికి పోగులుపెట్టి, ఖూనీలు, లూటీలు, విచ్చలవిడిగా చేసిన సంఘ వ్యతిరేక శక్తుల డైరీలను, అమ్మలకు రాసుకున్న ఉత్తరాలను, నెత్తుటి సిరాతో అల్లుకున్న కవిత్వాలను పోటీలు పడి పత్రికల్లో ధారావాహికంగా వేసి అభ్యుదయ వాదులన్న నకిలీ భుజకీర్తుల కోసం అడ్డమైన పాట్లు పడతారు.
మీడియా వారు ఓవరాక్షన్లు చేసినంత మాత్రాన రాజ్యమేలే వారు గంగవెర్రులెత్తాల్సిన పనిలేదు. 1984లో ఏమైంది? కాశ్మీర్ టెర్రరిస్టులు రవీంద్ర మహాత్రే అనే భారత దౌత్యాధికారిని అపహరించారు. మఖ్‌బూల్ భటే అనే ఉగ్రవాది ఉరిని ఆపకపోతే అతడిని చంపేస్తామని బెదిరించారు. అప్పుడు గద్దెమీద ఉన్నది ఐరన్‌లేడీ ఇందిరాగాంధి. ఏమైనాసరే అని గుండె రాయ చేసుకుని ఆమె ఉరి అమలు చేయంచింది. కిడ్నాపర్లు బందీని చంపేశారు. అయినా ప్రభుత్వం తొణకలేదు.
ఇందిరమ్మకున్న దిటవు ఆమె తరవాత సింహాసనమెక్కిన వాజమ్మలకు లేదు. కేంద్రహోంమంత్రి కూతురిని కాశ్మీరీ ముష్కరులు ఎత్తుకుపోగానే వి.పి.సింగ్ సర్కారుకు కాళ్లు చల్లబడి జైల్లోని ఉగ్రవాద విషసర్పాలను విడిచిపెట్టి కాశ్మీరాన్ని అల్లకల్లోలంలోకి నెట్టింది. 1999లో హైజాక్ అయిన పౌరవిమానం అమృతసర్‌లో ముప్పావుగంటసేపు ఆగినా పట్టుకోలేని వాజపేయి దొరతనం, కందహార్‌లో తాపీగా దిగాక హైజాకర్లు ముచ్చటపడిన ప్రకారం మసూద్ అజర్‌లాంటి ముగ్గురు నరరూపరాక్షసులను జైల్లోంచి పట్టుకెళ్లి పువ్వుల్లో పెట్టి పాకిస్తానీ ఏజంట్లకు అప్పగించి సర్వానర్థాలకు తలుపులు తెరిచారు. అదే నపుంసకపు ఒరవడిని కేంద్ర, రాష్ట్రాల్లో తరవాత ప్రభుత్వాలు బహు నిష్ఠగా అనుసరిస్తున్నాయి.
కిడ్నాపర్ల డిమాండ్లకు తలవంచనే కూడదని భీష్మించటం అన్ని వేళలా కుదరదు. నిజమే. పౌరుషానికి పేరు మోసిన ఇజ్రాయెల్ కూడా ఒక్క సైనికుడి ప్రాణాన్ని దక్కించుకోవటం కోసం యావజ్జీవ శిక్షపడ్డ 280 టెర్రరిస్టులు సహా వెయ్యిమంది ఖైదీలను ఇటీవలే వదలిపెట్టాల్సి వచ్చిందన్నదీ గుర్తుంచుకోవలసిందే. విధిలేని పరిస్థితుల్లో బ్లాక్‌మెయిలింగుకు తలఒగ్గినా, అక్కర తీరగానే విజృంభించి, కిడ్నాపర్ల వెంటపడి వేటాడి, జన్మలో మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగకుండా గట్టి శాస్తి చేయటమెలాగో ఇజ్రాయెల్ లాంటి దేశాలకు తెలుసు. అది మాత్రం మనకు చేతకాదు. ఒక్క మావోయిస్టులే ఈ నాలుగేళ్లలో పదహారువందల మందిని ఎత్తుకుపోయినట్టు అధికారగణాంకాలు ఘోషిస్తున్నా, ఇలాంటి సంక్షోభం ఎదురైనప్పుడు, ఆ తరవాతా ఏమి చేయాలన్న దానిపై కచ్చితమన్న విధానమన్నది కేంద్రానే్నలే వారికీ లేదు. రాష్ట్రాలకూ లేదు. కష్టం వచ్చిన కాసేపు గంగవెర్రులు... ఆ తరవాత కుంభకర్ణుడి గురకలు! మావోయిస్టుల చేతిలోని తుపాకిని కాదు; దాని వెనక ఉన్న సామాజిక, ఆర్థిక మూలాలను చూడాలంటూ మేధావులూ, అన్ని పార్టీల నేతాశ్రీల కోరస్ పలవరింతలు; వాటికి మీడియా సర్వజ్ఞుల పక్క వాద్య సహకారాలు! కిడ్నాప్‌కూ కిడ్నాప్‌కూ మధ్య విరామమే మన దృష్టిలో శాంతి! తదుపరి బందీ ఏ రాష్ట్రంలో ఏ జిల్లా కలెక్టరు లేక ఏ పార్టీ ఎమ్మెల్యే అన్నదే వేచి చూడాల్సిందల్లా.

Copy n Paste from Andhra bhoomi News Paper